26న స్వామి వారి కళ్యాణం
దూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తజన సందోహం..
సర్వాంగ సుందరంగా ముస్తాబైన మల్లికార్జునుడి దేవాలయం..
జాతర ఏర్పాట్ల పై ప్రత్యేక కథనం.
తొవ్వ, కేసముద్రం, ఫిబ్రవరి 26;

ఈనెల 26న జరగబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కేసముద్రం మున్సిపాలిటీ పరిధి దన్నసరి గ్రామం లోని మల్లికార్జున స్వామి దేవాలయం ధన్నసరి మల్లన్న.. నీకు దండాలయ్యా అంటూ నామస్మరణతో మారు మ్రోగనుంది. ఈ మేరకు భక్తులు కొలిచే భవానీ సమేత మల్లికార్జున స్వామి జాతర ప్రారంభించేందుకు ధన్నసరి మల్లికార్జున గుట్టపై జాతర ఏర్పాట్లను పూర్తి చేశారు.ఈనెల 26న బుధవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకము, పసుపు కుంకుమ పూజలు, అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, మంటపారాధన ,వాస్తు పూజ, కంకణ ధారణ, అఖండ కలశ స్థాపన,ద్వజావాహనము,అభిషేకములు, పెద్దపట్నం ఎదురు కోళ్లు అదే రోజు రాత్రి గం”12:20 ని”లకు కళ్యాణ మండపంలో స్వామివారి కల్యాణ మహోత్సవము నిర్వహించడం జరుగునని, 28న శుక్రవారం ఉదయం నుండి నిత్య పూజలు అభిషేకములు అదే రోజు బండ్లు తిరుగుట వనభోజనములు జరుగునని విశ్వబ్రహ్మణ పురోహిత సంఘం మండల అధ్యక్షులు, దేవాలయ ప్రధాన అర్చకులు ఆరెందుల ప్రభాకర చారి తెలిపారు.

*స్థల పురాణం*
వివరాల్లోకి వెళితే ఈ ప్రాంత ప్రజలకు ఇలవేల్పుగా నిలుస్తున్న మల్లన్న దేవుని గుట్ట స్థల పురాణమిది అనేక సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన నానబాల కట్టయ్య అనే యాదవుడు చెరువు కట్ట వద్దకు రాగా మల్లన్న గుట్టపై నుండి పెద్ద బండ రాళ్లు దొర్లిపడి దేవుని ప్రతిరూపం మెరుపులా కనిపించడంతో మర్చిపోయాడని ప్రతీతి ఆ తర్వాత ఆయన కలలోకి వచ్చిన దేవుడు తాను గుట్టపై ఉన్న సొరికే గుహలో ఉన్నానని తనకు గుడి కట్టించాలని కోరడముతో గ్రామస్తులంతా గుట్టపైకి వెళ్లి పరిశీలించగా సొరికెలో దేవుని మూలవిరాట్ కనిపించడంతో గ్రామస్తులు నమ్మకం కుదిరి అక్కడే గుడి కట్టించారు. ఈ గుట్టపై దేవాలయంలో మల్లికార్జున స్వామి ,శివలింగం, నందీశ్వరుడు, వినాయకుడు, ఎల్లమ్మ ,బద్ది పోచమ్మ, మైసమ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దాదాపు కొన్ని ఏండ్లుగా ప్రతి ఏటా ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దన్నసరి గుట్ట పరిసరాలు ప్రకృతి రమణీయంగా కలిగించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ధన్నసరి గుట్టపైనే లభిస్తుండడంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్య అంచలంచలుగా రెట్టింపు అవ్వడంతో ఈసారి జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

*గుడిమెట్ల నిర్మాణం*
గ్రామానికి చెందిన కొండ్రెడ్డి సరోజన వెంకట్ రెడ్డి దంపతుల ప్రధమ పుత్రుడు కీర్తిశేషులు శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం గ్రామ మాజీ సర్పంచ్ సింగిల్ విండో డైరెక్టర్ కొండ్రెడ్డి శ్రీవాణి -రవీందర్ రెడ్డి రెండు లక్షల 50 వేల రూపాయలతో గుడిమెట్ల నిర్మాణం చేపట్టారు.
