ఒకే కొండ లోని రెండు గుహల్లో వెలిసిన శివ కేశవులు…
సోమేశ్వరుని గండ దీపం పెడితే కోరిన కోర్కెలు తీరుతాయన్న నమ్మకం…
ఆకొండ పై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు…
వ్యాసకర్త :వీరంటి ముఖేష్ .9398236146…
పిలిచిన పలికే దేవుడవయ్యా సోమేశ్వర అంటూ తెలంగాణలో పల్లెలన్నీ ఇంటికి ఇలవేల్పుగా నిలిచిన దేవుడు సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామీ.
జనగామ జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం లోనే శివ కేశవుల క్షేత్రం చాల ప్రసిద్ది చెందింది . 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి పాలకురి సోమనాధ కవి జన్మస్థలం కూడా ఇదే. ఆయన సమాధిని ఇక్కడ చూడవచ్చు. ఈ చారిత్రాత్మక ఆలయం కొండపై 120 మీటర్ల ఎత్తులో ప్రక్కనే ఉన్న రెండు గుహలలో అవతరించిన శివుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అంకితం చేయబడింది. రెండు గుహల చుట్టూ ఉన్న ‘ప్రదక్షిణ మార్గం’ చాలా సహజమైనది. శిథిలమైన ‘సూర్య’ ఆలయం ఉంది స్వచ్ఛమైన నీటితో సహజ సిద్దంగా ఏర్పడినకోనేరు కూడా ఈ ప్రదేశంలో చూడవచ్చు. ఒకప్పుడు వీర శైవ’ మతం పెట్టిన పేరుగా వర్ధిల్లిన ఈ ప్రదేశం వీరశైవ మత అనుచరులు కాలక్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయారు, ప్రస్తుతం ఇది వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా ఉంది. యాత్రికులు ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తున్నారు. ప్రధానంగా వీరశైవులు ప్రతిష్ఠాపన దేవతలు సోమనాధకుని ఆశీస్సులు పొందేందుకు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా సందర్శిస్తారు.పాలకుర్తి
సోమేశ్వరాలయం కథ
కన్నడంలో హాలు అంటే తెలుగులో పాలు అని అర్థం. కన్నడం హాలకురికే తెలుగు పాలకురికి. వీరశైవులు విస్తరించిన క్రమంలో వెలసిన క్షేత్రమే పాలకుర్తి సోమేశ్వర దేవాలయం. కురికి అంటే ఒక ధాన్య విశేషం అని చరిత్రకారుడు విరువంటి గోపాలకృష్ణ వివరిస్తారు. కురి అనే కన్నడపదానికి గొర్రె అని అర్థముంది.పాలకురికి శైవక్షేత్రంగా ప్రసిద్ధమైంది. ఉత్తరాభిముఖంగా వున్న ఈ గుహాలయంలో ఎత్తైన వేదికమీద నలుపలకల రూపంలో శివలింగం వుంది. ఈ లింగంతో పోలిన లింగం శ్రీకాళహస్తి ఆలయంలో యమలింగం కనిపిస్తుంది. లింగానికి కొంతకాలం కింద పానవట్టాన్ని అమర్చారు. సోమేశ్వరుడిగా ప్రసిద్ధుడైన ఈ సోమలింగేశ్వరునికి ఎడమవైపు మరొక గుహలో లక్ష్మీనరసింహస్వామి వెలిసాడని భక్తులు ఆరాధిస్తున్నారు. వ్యక్తరూప నరసింహునికి విగ్రహం వుంది.తొలి తెలుగు కావ్యకవి, బసవపురాణం, పండితారాధ్యచరిత్ర వంటి గొప్ప కావ్యాలను రచించిన పాలకుర్కి సోమనాథుడు ఈ గుహాలయంలోనే తపస్సు చేసాడని ప్రతీతి. కవి పేరుమీదనే ఈ గుహాలయ శివలింగం పాలకురికి సోమేశ్వరుడైనాడని. రాజుల పేరు మీద నిర్మించిన దేవాలయాలు వారి పేరు కలిపిన శివాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. కాని, ఇక్కడ కవి పేరు మీద ఈ శివాలయం నిలిచిపోయింది.గుడి చుట్టు ప్రదక్షిణమార్గం సహజసిద్ధమైన కొండలో తొలువబడివుంది. కొండ మీద గండదీపం వెలిగించే ఆచారం వుంది. రాయగిరి వంటిచోట కూడా జాతర, బ్రహ్మోత్సవాల సందర్భంగా
కోరిన కోరికలు తీర్చే గండ దీపం
కొండ మీద గండదీపం వెలిగిస్తే ఇప్పటికీ కోరిన కోర్కెలు తీరుతాయని సాక్ష్యంగా దీపం నిలుస్తుంది ఇప్పటికీ వెలిగించే దీపం భక్తుల విశ్వాసంతో కొన్ని వందల ఏండ్ల నుంచి ఇప్పటికి పాటించబడుతున్నది.
అంతుచిక్కని కొండ రహస్యాలు ఇప్పటికీ పాల్కురి
దేవాలయంలోనికి ప్రవేశించే వారికి ఆ కొండ రహస్యాలు అంతు బట్టవు. ద్వారం మీద తేనెటీగల తెట్టెలుంటాయి. గుడిలోనికి పవిత్రులనే ప్రవేశించనిస్తాయి. అపవిత్రులను కాటేస్తాయనే జనంలో ప్రచారం వుంది. అంతేకాకుండా రాత్రి స్వామి వారి గుహల్లో పూజలకు ఆకాశ మార్గాన దేవుళ్ళు వస్తారని కొన్ని వందల ఏండ్ల నుంచి స్వామి వారికి సూర్యోదయం ముందే ఒక దేవ నాగు పూజలు చేస్తుందని ముఖ్య మైన పర్వ దిన వేళలో. అందరికీ కనిపించేలా వస్తుందని అక్కడ భక్తులు చెప్పుకుంటున్నారు..అంతేకాకుండా
స్థానిక కైఫీయతుల ప్రకారం పాల్కురికి సోమనాథుడిక్కడే జన్మించాడని, తన తలిదండ్రులు సోమేశ్వర భక్తులు. సోమేశ్వరుని దయవల్లనే తమకు పుత్రుడు కలిగాడని, కనుక దేవుడి పేరు తమ కొడుకుకు పెట్టుకున్నారని చెప్తుంటారు. సోమనాథుడు వీరశైవ మతాచార్యుడిగా పాలకురికిలోనే ఎక్కువ కాలం వున్నాడని, తన కావ్యరచనలను ఇక్కడే చేసాడని, సోమనాథ శైవమఠం వున్నది. కాని, దానిలో సమాధిగా గుర్తించదగిన ఆధారాలు లభించలేదు.
పాలకుర్తి సోమనాథుని సమాధిగా పిలువబడుతున్న గుడి శైవమఠం వలె వుంది. గుడి నిర్మాణానికి వాడిన రాతిగోడలు, గర్భగుడి ముందర వరండా, స్తంభాలు 300 సం.ల కింద కొత్తగా పునరుద్ధరణ చేయబడ్డట్టున్నాయి. గర్భగుడిలోని బాణలింగ, పానవట్టాలు (కళ్యాణీ)చాళుక్యుల కాలంనాటివి. దేవాలయ విమానం సోపాన పద్ధతిలో నిర్మించబడింది. అటువంటి విమానం కొలనుపాకలోని వీరనారాయణ దేవాలయం మీద చిన్న రూపంలో కనిపిస్తుంది.
అంతరాళంలో కాకతీయ శైలిని తలపించే స్తంభాలున్నాయి. అంతరాళం కప్పులో వున్న అష్ట భుజకోణాల నడుమ అష్టదళ పుష్పం అగుపిస్తున్నది. అక్కడ అంతరాళంలోనే కనిపించే విడిశిల్పాలలో నాగశిల్పాలున్నాయి. వినాయక విగ్రహం చాళుక్యుల కాలంనాటిది. 3పడగలతో, కత్తి, డాలు ధరించిన నాగదేవతా శిల్పం అంతకన్నా పురాతనశైలిలో వున్నది. ప్రత్యేకంగా గదివంటి నిర్మాణమున్నచోట రెండు స్త్రీ, పురుష దేవతల స్థానకమూర్తులు కొత్త శిల్పాలే అయినా భిన్నమైన ప్రతిమాలక్షణాలతో వున్నాయి. చతుర్భుజాలలో వెనక చేతులలో త్రిశూలం, ఢమరుకం, ముందు చేతులలో కత్తి, గొడ్డలి వున్న పురుష శైవదేవతాశిల్పం అధోశాటీ(ధోవతి), ఉదరబంధం, కంఠహారం, జటలు, మకుటం ధరించి కనపడుతున్నది. స్త్రీ దేవతామూర్తి కూడా చతుర్భుజే. వెనక చేతులలో త్రిశూలం, ఢమరుకం, ముందుచేతులలో శంఖం, ఫలం వున్నాయి. చీరె, వడ్డాణం, కంఠహారం, కుండలాలు, మకుటం ధరించిన ఈ దేవత అగ్నిశిఖలతో వుంది.
గుడిముందరి వరండాలో రెండు నందులు వున్నాయి. ఈ చిన్న నందులు పెద్దగజ్జెల పట్టెడులతో అలంకరించబడ్డాయి. ఇవి చాళుక్యుల శైలిలో వున్నాయి.
నలుపలకలు, 8ముఖాలు, పైన మళ్ళీ 4పలకలు, 8ముఖాలు, పైన 4పలకలు కలిగిన గుడి ముందర ధ్వజస్తంభం కూడా కొత్తగా నిలిపినదే. ఈ ధ్వజస్తంభ వేదికకు ఆనించి నిలిపివున్న భైరవవిగ్రహం, దాని పక్కన ఎడమ అరచేతిలో లింగం, దాన్నిమూసిన కుడి అరచేతితో కుడివైపు సిగకట్టి, నిలిచివున్న శివభక్తుని శిల్పం వుంది. ఇటువంటి శిల్పాలు మొగిలిచెర్లలో కనిపించాయి. ఇది ఆత్మాహుతి వీరగల్లు. వీరశైవులలో ఆత్మాహుతి శివభక్తిపరంగా కీర్తనీయమైంది. కళ్యాణీ చాళుక్యుల కాలంలో కాలాముఖుల సంప్రదాయంగా వున్న ఈ ఆత్మాహుతులు విరివిగా జరిగాయి. కాకతీయుల చరిత్ర కథాంశంగా వున్న‘ క్రీడాభిరామం’లో వీరభటులు, మైలారుల గురించి వర్ణనలు ఆత్మాహుతులకు సంబంధించినవే. శ్రీశైలం కొండమీద శివునిపేరు మీద తలపండులియ్యడం, గండ కత్తెరలతో గొంతులు కత్తిరించుకోవడం, శూలాలపైకి దూకడం వంటి ఆత్మాహుతులనేకం జరిగాయని చారిత్రక గ్రంథాలు, శైవ కావ్యాలలో రాయబడింది.ఇక్కడ గుడికి సంబంధించిన శిల్పాలు, గర్భాలయ, అంతరాళాలున్నాయి. పునరుద్ధరణ చేసిన జాడలగుపిస్తున్నాయి …
పాలకుర్తి సోమన్న దర్శనం తో పరమ ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం ….
(కార్తీక సందర్భంగా పాలకుర్తి దేవాలయ తీర్థ దర్శనం )







