వోటు పడేదెటో..!?
అభ్యర్థుల్లో టెన్షన్… టెన్షన్
తోవ్వ ప్రత్యేక కథనం:
విశ్లేషకులు:ముఖేష్ వీరంటీ
9398236146.
శాసనసభ ఎలక్షన్ సీన్ క్లైమాక్స్కు చేరింది. ఇప్పటివరకు హెూరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో వోటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎవరికి వారే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు హామీల వర్షం కురిపించిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు… ఇప్పుడు ‘ఆపరేషన్ ఆకర్ష్’కు శ్రీకారం చుట్టారు. వివిధ వర్గాల వోటర్లను తమవైపు తిప్పుకునేందుకు తాయిలాల పర్వానికి తెరతీశారు. అయితే, మునుపెన్నడూ లేని విధంగా వోటర్ అంతరగం ఎవరికీ అంతుపట్టడం లేదు. అంతెందుకు అసలు ఏ పార్టీ అభ్యర్థికి కూడా వోటర్ నాడి తెలుసుకోలేకపోతున్నారు. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వోటర్ నాడి ఎటువైపో? వోటు పడేదెటో?అనేది తెలియక ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ టెన్షన్లో పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే, అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థులతో త్రిముఖ పోటీ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని స్థానాలలో బిజెపి పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ… నాలుగు ఐదు స్థానాల్లో త్తప్ప వారి ప్రభావం వుండకపోవచ్చు
. కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నామా అంటే ఉన్నాం అనే విధంగా కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థుల ప్రచారం సాగుతుంది. ఈ రెండు పార్టీల అభ్యర్థుల ప్రచార తీరును అదే పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే తప్పుబడుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు అందర్ని కలుపుకుని పోవడం లేదనీ, ప్రచారం చాలా చప్పగా సాగుతుందంటూ పార్టీ సీనియర్లు చాలా వరకు ఈ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగుతున్న ప్రచారానికి మరికొన్ని గంటల్లో ముగియనుంది. పోలింగ్కు మాత్రం మూడు రోజుల గడువు మాత్రమే మిగిలింది. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం ఆయా పార్టీ అభ్యర్థులు వోటర్ నాడిని పట్టుకోవడంలో విఫలమైనట్లు దాదాపుగా అన్ని పార్టీల నుంచి వినిపిస్తుంది. ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు, స్టార్ క్యాంపెయినర్లు, వ్యూహకర్తలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులవుతున్నాయి. అభిప్రాయాలు తారుమారవుతున్నాయి. ఆలోచనలు అంతుపట్టడం లేదు. నియోజకవర్గాల్లో అనూహ్య పరిణామాలు, విచిత్ర పరిస్థితులు.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఇదే టాపిక్. దీనికి ఒకే ఒక కారణం. వోటర్ సైలెంట్. అంత..ఇంత..అంటూ..ఎవరెంత మొత్తుకున్నా, వోటర్లు మాత్రం ఏం మాట్లాడటం లేదు. వోటు ఎవరికి వేస్తారనేది కనిపెట్టడం విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వోటర్ల చూపు ఎటు వైపు ఉందో అంతుపట్టక విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల టెన్షన్ మాత్రం అంత ఇంత కాదని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయా పార్టీలు నిర్వహించిన సభలు, సమావేశాలకు దాదాపుగా అన్నింటికి ఒకే విధంగా జనం హాజరయ్యారు. సభలు, సమావేశాలకు ఈదఫా అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులు నీళ్లలో ఖర్చు చేశారు. ఫలితంగా అన్ని పార్టీల మీటింగ్ల సభలు, సమావేశాలకు జనం తండోప
తండలుగా వచ్చారు కానీ, ఆఖరికి వోటు ఎవరికి వేస్తారో మాత్రం వోటర్ చెప్పడం లేదు. ఇదే అభ్యర్థులను కలవరపాటుకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది ఇకపోతే, పోలింగ్ తేదీ తరుముకొచ్చింది. క్షణానికో విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ద్విముఖ పోటీ ఉన్న చోట ఇప్పుడు త్రిముఖ పోటీ కనిపిస్తోంది. నిన్నటి వరకు ఒకరికి విజయం దక్కుతుందని అంచనా వేసిన విశ్లేషకులకు.. మారిన పరిణామాలతో ఎవరికి ఎడ్జ్ అనేది చెప్పలేని పరిస్థితి ఎదురవుతోంది. ఎప్పుడూ లేని విధంగా వోటర్లు వోటింగ్ విషయంలో సైలెంట్గా ఉన్నారు. ఎవరు ఎంతగా తమ బలాల గురించి హెూరెత్తించినా.. వోటర్లు మాత్రం అందరినీ నిశితంగా పరిశీలిస్తున్నారే తప్ప .. నో రెస్పాన్స్. దీంతో ఎవరు ఎవరికి వోటు వేస్తారనేది కనిపెట్టడం కష్టంగా మారింది. మొదట అధికార బి అర్ ఎస్ పార్టీ కి కొంత వ్యతిరేకత వున్న అది మెళ్ళ మెల్లగా తగ్గుతూ వచ్చింది బిజెపి కొంత వ్యతిరేక ఓట్లు చిలుస్తుందనుకున్న కాంగ్రెస్ బి అర్ ఎస్ పై తమ మాటల ఆయుధాలను ఎక్కు పెడుతూండటం తో ఎవరి ఓట్లు ఎవరికి పడుతాయి చెప్పడం కష్టంగా మారింది ఎవరివైపు మొగ్గు చూపుతారోనని ప్రతీ ఒక్కరిలో టెన్షన్ కనిపిస్తోంది. ప్రభుత్వం పథకాల వల్ల లబ్ది పొందిన వారు కూడా పోలింగ్ రోజు ఎలా స్పందిస్తారనేది సందిగ్ధంగా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతమన్న తేడా లేకుండా వోటర్లు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.
. మేనిఫెస్టోలు, అందులో ప్రస్తావించిన అంశాలను సైతం ఎవరూ మాట్లాడటం లేదు. సహజంగా ఎవరు గెలుస్తారు.. ఎంత మెజార్టీ అనే అంశాల జోలికి అసలు వెళ్లడం లేదు. దీంతో విశ్లేషకులు సైతం వోటర్ల నాడి అందక తలపట్టు కుంటున్నారు. అభ్యర్థుల పనితీరు చూస్తున్నారా.. లేక వారి మంచితనం చూస్తున్నారా.. ఇంకా లేదంటే అభివృద్ధి చేసేవారిని సెలెక్ట్ చేస్తున్నారా? అంటే అది కూడా అంతుపట్టడంలేదు. పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. అయితే ఈ ఎన్నికలను బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అన్ని పార్టీలు ఛాలెంజ్ తీసుకున్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చావోరేవోలాంటిది. దీంతో ఆయా పార్టీలకు చెందిన ఎక్కడ కూడా రాజీ పడటం లేదు. డబ్బులు, మద్యంకు ఎక్కడ కూడా వెనకాడటంలేదు. అయితే, ఎలాగైనా వోటర్లతో వోట్లు వేయించుకోవడానికి ఉన్న సమయాన్ని ప్రలోభాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనీ, వోటర్లకు తాయిలాలకు ఏర్పాట్లను చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. నగదు, వస్తువులతో ఎర, వోటర్ స్లిప్పులతో పాటే నోట్లు, మద్యం పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత చేసినా కూడా అభ్యర్థుల మదిలో గుబులు పుట్టిస్తుందనీ, వోటర్లు మదిలో ఏముందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే!
