5 నెలల తర్వాత బెయిల్ తో ఆనందం లో గులాబి శ్రేణులు…
Thovva web news.in//27,Aug.Tue,12;30.pm

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఆమె బెయిల్ పిటిషన్పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికీ వెళ్లరని చెప్పారు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ముకుల్ రోహత్గి, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు.అనంతరం ఈడీ తరఫున వాదనలు వినిపించిన ఏఎస్జీ, ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారని, ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని కోర్టుకు తెలిపారు. ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని తెలిపారు. ఫోన్లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశ్నించగా, మెసేజ్లను కాదు, పూర్తిగా డేటాను ఫార్మాట్ చేశారని, సెల్ఫోన్ డేటాను పూర్తిగా ఫార్మాట్ చేయడం అసాధారణమని వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
