మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిన చైనా….
వైరస్ ముప్పు తో ఇప్పటికే హప్పిటల్స్ లో నిండుతున్న రోగులు..
Thovva web news.02,jan.Thu 10;p.m


మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో (China) మరో వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు.దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఈ వైరస్ సోకినవారిలో కొవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందన్నది ఆ నివేదిక సారాంశం. దాదాపు ఐదేళ్ల క్రితం కొవిడ్-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి అధికార మీడియా ‘సీసీటీవీ’ వెల్లడించింది. దీని ప్రకారం డిసెంబరు 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

