వెదజల్లే మరియు డ్రమ్ సీడర్ సాగు యాజమాన్య పద్ధతులు.
రైతులకు అవగాహన కల్పించిన సహాయ వ్యవసాయ సంచాలకులు శోభన్ బాబు

నర్సింహులాపేట మండలంలోని పెద్ద నాగారం గ్రామము లోని వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసిన పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శోభన్ బాబు గారు, రైతులు బొబ్బ అశోక్ రెడ్డి, నూక సురేష్, బొబ్బ లింగారెడ్డి, అజ్మీర శీను, అనంతల కృష్ణ,ఏఈఓ లు పాల్గొన్నారువెదజల్లే మరియు డ్రమ్ సీడర్ సాగు యాజమాన్య పద్ధతులు*పొలం తయారీ*: వెద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు వేసవిలోనే నేలను కలియదున్నాలి. నేల స్వభావాన్ని బట్టి నాలుగు మూలలు సమానంగా ఉండేటట్లు పెద్ద పెద్ద మట్టి గడ్డలు లేకుండా పొలం సమతలంగా ఉండేటట్లు చూసుకోవాలి. తడి విత్తన పద్ధతిలో సాగు చేసేటప్పుడు సాధారణ నాట్లు పద్ధతిలో ఎలాగైతే భూమిని తయారు చేస్తామో అలాగే తయారు చేయాలి. చివరి సారి దమ్ము చేసిన తర్వాత పొలమంతా ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చదును చేయాలి. పొలాన్ని చిన్నచిన్న మడులుగా విభజించుకుంటూ చదును చేయడం వలన నీరు పెట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మట్టి పేరుకున్న తరువాత బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. వీటి ద్వారా ఎక్కువగా నీరు, మురుగు నీరు బయటకు పోవడానికి వీలవుతుంది.
వెదజల్లే విధానంలో
విత్తేముందు పొలం వైశాల్యాన్ని బట్టి ఎన్ని మడులున్నాయో చూసుకొని ఆ ప్రకారం విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి, మొలకెత్తిన విత్తనాన్ని అన్ని భాగాలుగా చేసుకుంటే, విత్తనాలు సమానంగా నేలమీద పడతాయి. మొక్కల సాంద్రత సమంగా ఉంటుంది. విత్తిన రెండు వారాల తరువాత వత్తుగా ఉన్న మొక్కలను తీసివేసి పలుచగా ఉన్న చోట నాటుకోవాలి.
*డ్రమ్ సీడరుతో వరి విత్తే విధానం*
డ్రమ్ సీడరుతో విత్తేటప్పుడు విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి గింజల నుంచి మొలక ఆరంభదశలో వున్నప్పుడు డ్రమ్లలో నింపుకోవాలి. అలా కాక మొలక పొడువగా ఉంటే డ్రమ్లలో పోసినప్పుడు అవి అల్లుకుపోయి రంధ్రాలకు అడ్డుపడి విత్తనాలు సులువుగా రాలవు. ఈ విధంగా మొలక ఆరంభ దశలో వున్న విత్తనాలను డబ్బాలలో 3/4 వంతు వరకు నింపి ముందుగా దమ్ము చేసి చదును చేసిన పొలంలో డ్రమ్ సీడరును దానికున్న పిడి సహాయంతో లాగడం వలన చక్రాలతో పాటు డ్రమ్ములు తిరిగి డ్రమ్ములకున్న రంధ్రాల ద్వారా విత్తనాలు పొలంలో వరుసగా పడతాయి. ఇలా ఒకసారి డ్రమ్సీడరును లాగితే 8 వరుసలలో వరుసకు వరుసకు మధ్య 20 సెం.మీ. దూరంలో 5 నుంచి 8 గింజలు పడతాయి. వరుసలు పాడవకుండా ఉండాలంటే పొలంలో వారం వరకు బుదర పదునుగా నీరు పలుచగా ఉండాలి. అయితే, నీరు పలుచగా ఉండటం వలన కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కావున కలుపు మందును తగు మోతాదులో 6–7 రోజుల లోపు వేసుకోవాలి. ఈ డ్రమ్సీడరును ఉపయోగించి రోజుకు 2–3 ఎకరాలు విత్తుకోవచ్చు. ఒక ఎకరం పొలాన్ని ఇద్దరు కూలీలు రెండున్నర గంటలలో విత్తగలరు.
*నీటి యాజమాన్యం*
విత్తిన తరువాత మొక్కల మొదటి ఆకు పూర్తిగా పురి విచ్చుకొనే వరకు (అంటే సుమారు 7–10 రోజులు) ఆరు తడులను ఇవ్వాలి. మొక్కలు 4–5 ఆకులు తొడిగిన తరువాత పొలంలో పలుచగా అంటే 2–3 సెం.మీ.ల లోతు నీరుండాలి. అంతకు మించి నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. పైరు పిలక తొడిగి దుబ్బు కట్టుట పూర్తి అయిన తరువాత నుంచి కోతకు సుమారు 10 రోజుల ముందు వరకు 5 సెం. మీ. లోతు నీరుండలన్నారు.
,పంటకోత
నేరుగా విత్తే పద్ధతిలో సాంప్రదాయ ఊడ్పు విధానం కన్నా పంట 7–10 రోజులు ముందే కోతకు వస్తుంది. పంటను కూలీల ద్వారా లేక కోత–నూర్పిడి యంత్రం ద్వారా కోయవచ్చు.
*నేరుగా విత్తే పద్ధతిలో జాగ్రత్తలు*
1 పొలమంతా సమానంగా ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. దీనితో పొలమంతా నీరు సమానంగా పారి ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
2 ఎకరానికి సిఫారసు చేసిన విత్తన మోతాదు ప్రకారమే విత్తుకోవాలి. ఎక్కువ విత్తనం వాడితే మొక్కలు ఒత్తుగా, తక్కువ వాడితే పలుచగా వుండి దిగుడులు తగ్గుతాయి. నేలలో విత్తనాన్ని 3 సెం.మీ. కంటే ఎక్కువ లోతులో వెద పెట్టకూడదు.
3 విత్తనాన్ని నాటిన రెండు రోజులలోపే కలుపును అరికట్టాలి. సరైన మందులను, సరైన కాలంలో, సరైన మోతాదులో వాడాలి.
4 విత్తనం పూర్తిగా మొలకెత్తిన తరువాత మొదటి నీటి తడిని భూమి స్వభావాన్ని బట్టి 7 నుంచి 15 రోజుల తర్వాత ఇవ్వవచ్చు.
5 విత్తిన రెండు వారాల తరువాత ఒత్తుగా ఉన్నచోట మొక్కలు తీసి పలుచగా వున్నచోట నాటుకుంటే మొక్కల సాంద్రత పొలమంతా సమానంగా ఉంటుంది.
6 నానబెట్టి, మండెకట్టిన విత్తనాలకు మొలక ఎక్కువగా పెరగనివ్వకూడదు. పెరిగినట్లైతే విత్తేటప్పుడు లేదా వెదజల్లేటప్పుడు మొలక విరిగి పోయే ప్రమాదం ఉంది.
7 విత్తిన 10 రోజుల వరకు ఆరు తడులనివ్వాలి. నీరు ఎక్కువగా ఉంటే మురుగు కాల్వల ద్వారా తీసివేయాలి. లేదంటే మొలక మురిగిపోతుంది. దుబ్బు దశ నుంచి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
*వరిని నేరుగా విత్తితే లాభాలు*
1 తొలకరి వానలు పడిన వెంటనే వరి సాగు మొదలు పెట్టుకోవచ్చు.
2 అటు వర్షపు నీరు, ఇటు కాలువ నీరును ఉపయోగించుకుంటూ పంటను పండించవచ్చు.
3 దీని వలన పంటకాలం నష్టపోకుండా సకాలంలో సాగు చేయడానికి వీలవుతుంది.
4 ఈ పద్ధతిని పాటించడం వలన కాలువలలో నీరు ఆలస్యంగా వచ్చినా వరి పంట తరువతా మినుము, పెసర వంటి పైర్లను సకాలంలో విత్తవచ్చు.
5 ఈ పద్ధతిలో తక్కువ మోతాదు విత్తనం వాడటం వల్ల విత్తన ఖర్చు, నారు పెంచడానికి, నారు తీయడానికి, నారు మోయడానికి, నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది.
6 సరి అయిన సమయంలో విత్తడం వల్ల నాట్ల పద్ధతిలో కన్నా చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అందువల్ల సస్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి.
7 విత్తనం భూమిపై తక్కువ లోతులో మొలకెత్తడం వలన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది.. పైరు నీటిని, పోషక పదార్థాలను సక్రమంగా వినియోగించుకుంటుంది.
8 నాట్ల పద్ధతిలో కన్నా ఈ విధానంలో 20% నీరు ఆదా అవుతుంది.
9 నాట్ల పద్ధతిలో కన్నా 7–10 రోజుల ముందుగా వరి పంట కోతకు వస్తుంది. నేరుగా విత్తే పద్ధతిని అనుసరించడం వలన సాగు ఖర్చు తగ్గడంతో పాటు 10–15% అదనపు దిగుబడులు కూడా సాధించవచ్చు.
వరి నేరుగా విత్తే పద్ధతిలో సమస్యలు
1 సరైన లోతులో విత్తుకోవటం
2 ప్రారంభ దశలో కలుపు నిర్మూలన
3 సరైన నీటి యాజమాన్యం
4 పొలాన్ని సరిగ్గా చదును చేసుకోవడం తో మేలైన సాగు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు